విశాఖపట్నంలో భారత అంతర్జాతీయ సముద్ర ఉత్పత్తుల ప్రదర్శన ప్రారంభమయ్యింది . ఈ ప్రదర్శనలు మూడు రోజులపాటు కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్ ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ దేశంలోని కోస్తా రాష్ట్రాల్లో ఆక్వా కల్చర్, చేపల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ఫెడరేషన్లు ఏర్పాటు చేస్తామని ఈ ఫెడరేషన్లు స్టేట్ ఏజెన్సీలుగా పనిచేస్తాయని, వాటిలో నియమితులయ్యే సభ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శుల నేతృత్వంలో ఆక్వా రంగం అభివృద్దికి కృషిచేస్తారని చెప్పారు. వీటికి కేంద్రం తరపున సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎంపెడా) అన్ని విషయాల్లో సహాయ పడుతుందన్నారు.
ఆక్వా రంగం అభివృద్ధికి రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు
చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మొత్తం సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో 2009-10లో 20 శాతం ఉన్న ఏపీ వాటా 2014-15 సంవత్సరానికి ఏకంగా 45 శాతానికి పెరిగిందన్నారు. మత్స్యరంగ పరిశ్రమలు స్థాపించాలనుకున్నవారికి దేశంలోని ఏ రాష్ట్రం ఇవ్వని అత్యుత్తమ రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తున్నామని తెలిపారు. ఎంపెడాతో కలిసి ‘ఆక్వాటిక్ క్వారంటైన్ కేంద్రం’, విశాఖలో ‘బ్రూడర్ మల్టిప్లికేషన్ కేంద్రం’, సూర్యలంకలో ‘మడ్క్రాబ్ సీబాస్ హ్యాచరీ’, అనంతపురంలోని పి.ఎ.బి. రిజర్వాయర్లో ‘నైల్ తిలాపియా శాటిలైట్ బ్రీడింగ్ కేంద్రం’ ఏర్పాటుకు నిధులు మంజూరు చేశామన్నారు. ఆరు జలాశయాల్లో నైల్ తిలాపియా రకం చేపల పెంపకానికి వీలుగా 2015-16లో కేజ్ కల్చర్ ప్రారంభించామని, మరో ఆరు రిజర్వాయర్లలో వాటిని ప్రారంభించడానికి ప్రతిపాదనలు ఉన్నాయని చెప్పారు. 5,441 చెరువుల్లో చేప విత్తన పెంపకం కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదిస్తున్నామన్నారు. భీమవరంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో జాతీయ మత్స్య విశ్వవిద్యాలయం (‘నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఆక్వాకల్చర్’)ను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. మత్స్య రంగ అభివృద్ధికి నిపుణులతో కమిటీ వేస్తామని చెప్పారు. తానే ప్రతినెలా ఆ కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలను సమీక్షించి తదుపరి చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. విశాఖపట్నం, భీమవరంలలో ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఎక్సలెన్స్’ ప్రాజెక్టులను కేంద్రం మంజూరు చేయడంపై హర్షం వ్యక్తంచేశారు.
దేశంలో ప్రభుత్వ సహకారం పెద్దగా లేకుండానే వ్యాపారులంతా కలిసి ఆక్వా రంగాన్ని ముందుకు తీసుకువెళుతున్నారని ప్రశంసించారు. ఈ పరిశ్రమ త్వరలోనే 10 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుతుందన్నారు. ఒడిశా, పశ్చిమ బెంగా ల్, గుజరాతలు ఆక్వా రంగంలో మంచి విధానాలను అనుసరిస్తున్నాయని, వాటిని పరిశీలించాలని ఎపి వ్యాపారులకు సూచించారు. ఎంపెడా ప్రపంచంలో అత్యుత్తమ పారిశ్రామిక విధానాలను తీసుకువస్తుందని, వాటిని ఉపయోగించుకోవాలన్నారు. సముద్రం నుంచి, చెరువుల నుంచి సేకరించిన చేపలు, రొయ్యలను యథాతథంగా ఎగుమతి చేస్తున్నారని, వాటిని ప్రాసెసింగ్ చేసి పంపితే ఇంకా ఎక్కువ ఆదాయం సంపాదించవచ్చని మంత్రి సూచించారు.
విశాఖలో అంతర్జాతీయ సముద్ర ఉత్పత్తుల ప్రదర్శన ప్రారంభం
The post విశాఖలో అంతర్జాతీయ సముద్ర ఉత్పత్తుల ప్రదర్శన ప్రారంభం appeared first on Kisan Updates.